బాబును వెనకేసుకొచ్చిన విష్ణుకుమార్ రాజు: జగన్కు షాక్
వైసీపీకి షాకిచ్చిన విష్ణకుమార్ రాజు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటని బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేతలు పనిలేకుండా బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ఏపీ సీఎం చంద్రబాబునాయుడకు అనుకూలంగా మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీ, బిజెపి నేతలు టిడిపిపై ఒంటికాలిపై విమర్శలు చేస్తోంటే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
ప్రధానిని ఏపీ సీఎం మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీలో విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తారని ఆయన గుర్తు చేశారు. ఇందులో తప్పుందా అని ఆయన ప్రశ్నించారు.
టిడిపి, జనసేన వల్లే 2014లో బిజెపికి 4 సీట్లు వచ్చాయని ఆయన చెప్పారు.2019 ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు లేనిదే ఏ పార్టీ కూడ అధికారంలోకి రాదని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 2019లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ అధిష్టానం చూసుకొంటుందని ఆయన చెప్పారు.
ఏపీలో చంద్రబాబునాయుడు పులి, ఢిల్లీలో పిల్లి అంటూ బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన విమర్శలు సరైనవి కావని ఆయన చెప్పారు. బిజెపి లేకపోతే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చేది కాదన్నారు. సాక్షరభారత్లో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించారని ఆయన చెప్పారు. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు విషయం సీఎంకు తెలిసి ఉండకపోవచ్చునని ఆయన చెప్పారు.