నరసింహన్ ఇక తెలంగాణకే: ఏపీకి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించారు.. నరసింహాన్ స్థానంలో విశ్వభూషణ్ హరిచందన్ ను నియమించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్ ను నియమించారు. నరసింహాన్ స్థానంలో బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమించారు..ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా ఇప్పటివరకు నరసింహాన్ కొనసాగిన విషయం తెలిసిందే.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా ఉన్న నరసింహాన్ ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే గవర్నర్ గా కొనసాగుతారు. ఏపీ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ కొనసాగుతారు.
యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నరసింహాన్ గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం స్థానంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ నరసింహాన్ కొనసాగారు.
2014 లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజనకు గురైంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో నరసింహాన్ కొనసాగారు. ఆ తర్వాత కూడ రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై అవగాహాన ఉన్నందున నరసింహాన్ ను కొనసాగించారు.
కేంద్రంలో రెండో దఫా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడ సాగుతున్నాయి. ఈ తరుణంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలని కేంద్రం భావించింది.ఈ మేరకు ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు.
1971లో ఆయన జనసంఘ్ లో చేరారు.ఆ తర్వాత 1988లో బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కూడ ఆయన పనిచేశారు. ఐదు దఫాలు సిలికా నుండి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఒడిశా మంత్రిగా కూడ పనిచేశారు.న్యాయవాదిగా కూడ పనిచేశారు. పలు పుస్తకాలు రాశారు.
ఏపీ రాష్ట్రంలో బీజేపీ బలపడాలని భావిస్తోంది.ఈ తరుణంలో ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించడం రాజకీయంగా ఆసక్తిని కల్గిస్తోంది.