విషాదం : ఇచ్చిన రుణాలు వసూలు కాక బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య..
బ్యాంకు టార్గెట్ల ప్రకారం లోన్లు ఇచ్చి.. అవి వసూలు కాక.. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక.. అప్పులు చేసి ఆ లోన్లు కట్టి.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడో బ్యాంక్ మేనేజర్.
యానాం : బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దాంతో తానే అప్పులు చేసి ఖాతాదారుల రుణాలు చెల్లించిన ఓ బ్యాంకు మేనేజర్ మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యానాంలో చోటు చేసుకుంది. ఎస్సై కనకారావు కథనం ప్రకారం.. సాయి రత్న శ్రీకాంత్ (33) ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్. భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆయన భార్య గాయత్రి పిల్లలను స్కూలుకు తీసుకువెళ్ళింది. అప్పటివరకు వారితో గడిపిన శ్రీకాంత్.. భార్య, పిల్లలు వెళ్ళిపోగానే ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇంటికి తిరిగి వచ్చిన భార్య ఎన్నిసార్లు తలుపు కొట్టినా.. తలుపు తెరవక పోవడంతో కిటికీలోంచి చూడగా శ్రీకాంత్ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో తలుపులు పగలగొట్టి ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీకాంత్ యానాంకు రాక ముందు మూడేళ్లపాటు మచిలీపట్నం బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేశారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేశారు.
అయితే, రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో బయట అప్పులు చేసి రూ.60 లక్షల వరకు శ్రీకాంతే చెల్లించాడు. తర్వాత యానాంకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా మరో రూ.37లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసిందని పోలీసు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో తన భర్త మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారని భార్య గాయత్రి పోలీసులకు తెలిపారు. అప్పులు తీరి పోతాయి అని గత రాత్రి ఎంతో ఆనందంగా చెప్పారని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.