జగన్ కు బిగ్ షాక్.. కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని..!
వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలోని కీలక బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి బాలినేని తప్పకున్నట్టుగా ఎన్టీవీ న్యూస్ చానల్ వార్తను ప్రసారం చేసింది. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్గా ఉన్నారు. ఇక, ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు.
ఇక, ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.