కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి జరగనున్న ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందకు వైసిపి అధ్యక్షులు, సీఎం జగన్ పలువురు మంత్రులు, కడప జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో సమావేశమయ్యారు. 

అమరావతి: తన సొంత జిల్లాలో జరుగుతున్న బద్వేల్ ఉపఎన్నికను (badvel bypoll) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం జగన్ (CM YS Jagan). ఇప్పటికే కడప జిల్లా (Kadapa) బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ఇక కదనరంగంలో దూకాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. గురువారం కడప జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నాయకులతో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. వైసీపీ అభ్యర్ధి దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సబ్బయ్య (venkata subbaiah)సతీమణి డాక్టర్ దాసరి సుధ (dasari sudha)కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా బద్వేల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులతో చర్చించారు సీఎం. ఈ సందర్భంగా దివంగత వెంకటసుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టరేనని... పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గ గెలుపు బాధ్యత ఈ సమావేశంలో పాల్గొన్నవారందరి మీద ఉన్నాయని జగన్ సూచించారు.

''మన అభ్యర్థి సుధ నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి. 2019 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మనకు దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలి. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదు...కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలి. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగింది. ఈసారి ఓటింగ్‌ శాతం మరింత పెరగాలి... ప్రతి ఒక్కరు ఓటు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలి'' అని జగన్ సూచించారు.

read more Badvel Assembly bypoll: కడప జిల్లా నేతలతో జగన్ భేటీ

''ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలి. గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలి. ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లాలి... వారిని ఓటేయాలని అభ్యర్థించాలి. వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్యం చేయాలి. నెలరోజులపాటు మీ సమయాన్ని కేటాయించి కేవలం బద్వేల్ ఎన్నికపైనే దృష్టిపెట్టాలి'' అని ఆదేశించారు.

వీడియో

''బద్వేలు ఉపఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలి. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయండి'' అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి(మైనార్టీ వ్యవహారాల మంత్రి) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.