విషాదం... కృష్ణానదిలో మునిగి బిటెక్ విద్యార్థి మృతి
మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి స్నేహితులతో కలిసి సరదాగా కృష్ణానదీ తీరానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
తాడేపల్లి: మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి స్నేహితులతో కలిసి సరదాగా కృష్ణానదీ తీరానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈత రాకపోయినా యువకుడు నీటిలోకి ఎందుకు దూకాడు... ఘటన అనంతరం కూడా తల్లిదండ్రులు పోలీసులు పిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యువకుడు ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఇంకేమైనా జరిగిందా అన్నది తెలియాల్సి వుంది.
వివరాల్లోకి వెళితే... విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి (20) బి.టెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో కొందరు స్నేహితులతో కలిసి ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట ఉన్న ఆక్వా డెవిల్స్లోకి ఈతకు వెళ్లాడు. అయితే సాయికి ఈత రాకపోవడంతో మిగతా స్నేహితులు నదిలోకి దిగి ఈత కొడుతుండగా గట్టుపై కూర్చున్నాడు.
హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు కానీ గట్టుపైకూర్చున్న సాయి నదిలో పడిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్నేహితులు ఆక్వా డెవిల్స్ సిబ్బందితో కలిసి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే నీటిలో మునిగి ఊపిరాడక పోవడంతో సాయి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా స్నేహితులు విజయవాడకు తరలించారు. ఏకైక కుమారుడు చనిపోయినా తల్లిదండ్రులు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి.