బాంబు పేల్చిన అవంతి.. వైసీపీలోకి కీలక నేతలు
ఇటీవల టీడీపీ ని వీడి.. వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ తాజాగా బాంబు పేల్చారు.
ఇటీవల టీడీపీ ని వీడి.. వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ తాజాగా బాంబు పేల్చారు. రానున్న రోజుల్లో పలువురు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. శుక్రవారం ఆనందపురం జంక్షన్ లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో అవంతి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
గత ఎన్నికల్లోనే తాను వైసీపీలో చేరుదామనుకున్నానని.. జగన్ తనను ఆహ్వానించారని అవంతి చెప్పారు. అయితే.. గంటా శ్రీనివాసరావు తనను టీడీపీలో చేర్చారని చెప్పారు. జగన్ కి పదవుల కంటే ప్రజలే ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టినా కూడా.. ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని అన్నారు.
గెలిపించిన నాయకుల భూములను కబ్జా చేసే వ్యక్తిత్వం గంటా శ్రీనివాసరావుదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో భీమిలి సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన గంటా ... ఆ తర్వాత ఆయనే అక్కడ నుంచి పోటీ చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై అధికార టీడీపీ ఐదేళ్లలో 50సార్లు మాట మార్చిందని అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరికి మంత్రి గంటా శ్రీనివాసరావు కారణమని ఆరోపించారు.