అవనిగడ్డలో అమానుషం... స్కూటీ పై వెళుతుండగా కొంగులాగి కిందపడేసి... మహిళపై అత్యాచారయత్నం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను ఎంత కఠినంగా శిక్షించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. కృష్ణా జిల్లాలో ఓ మహిళను స్కూటీ పైనుండి కిందపడేసి మరీ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో కామాంధుడు.
అవనిగడ్డ : ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళుతున్న మహిళ కొంగులాగి కిందపడేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో కామాంధుడు. అయితే ఎలాంటి దారుణం జరక్కముందే దుర్మార్గుడి చేతిలోంచి మహిళ సురక్షితంగా బయటపింది. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన ఓ మహిళ తన కాళ్లపై తాను నిలబడాలని వస్త్ర వ్యాపారం ప్రారంభించింది. కోడూరులో బట్టల దుకాణం నడిపిస్తూ గ్రామం నుండే ద్విచక్రవాహనంపై రాకపోకలు జరిపేది. రోజూ మాదిరిగానే గత బుధవారం ఉదయం కోడూరుకు వెళ్లిన మహిళ వ్యాపారం ముగించుకుని రాత్రి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. అయితే రోజూ వెళ్లే మార్గంలోనే వెళుతుండగా మార్గమధ్యలో ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
స్కూటీపై వేగంగా వెళుతుండగా ఇస్మాయిల్బేగ్పేట సమీపంలోని చెరువువద్ద మహిళను ఓ దుర్మార్గడు మహిళను అడ్డుకున్నాడు. ఆమె చీరకొంగు పట్టుకుని లాగడంలో స్కూటీపై నుండి కిందపడిపోయింది. ఇలా గాయాలతో పడిపోయిన ఆమెను రోడ్డుపక్కన పొదల్లోకి లాక్కుని వెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె రక్షించాలంటూ అరవడంతో రోడ్డుపై వెళుతున్న వారు ఆగారు. దీంతో బయపడిపోయి మహిళను వదిలి పరారయ్యాడు నిందితుడు.
స్థానికుల సాయంలో అక్కడి నుండి సురక్షితంగా ఇంటికి చేరుకున్న బాధిత మహిళ కుటుంబసభ్యులకు విషయం తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెండు బృందాలను ఏర్పాటుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు అవనిగడ్డ సీఐ శ్రీనివాస్ తెలిపారు. స్కూటీ పైనుండి కిందపడటంతో మహిళ స్వల్పంగా గాయపడగా అవనిగడ్డ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.