జగన్ మీద దాడి: చంద్రబాబు ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
జగన్ పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు ఎందుకు అప్పగించలేదని హైకోర్టు అడిగింది. కేసును ఎన్ఐఎకు ఎందుకు బదిలీ చేయలేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి విషయంలో హైకోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయంలో దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారని ప్రశ్నించింది.
జగన్ పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు ఎందుకు అప్పగించలేదని హైకోర్టు అడిగింది. కేసును ఎన్ఐఎకు ఎందుకు బదిలీ చేయలేదో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు సోమవారం వాదనలు విన్నది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు.
ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్ట్ లేదా, ఎయిర్ క్రాఫ్ట్ లో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందని అన్నారు. అన్ లా ఫుల్ అగనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఎవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3(ఏ)కింద కేసు నమోదు చేయాలని అన్నారు.