రైనా మేనత్త కుటుంబంపై దాడి: వీడిన మిస్టరీ.... స్వయంగా ప్రకటించిన పంజాబ్ సీఎం
భారతదేశంతో పాటు ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనత్త కుటుంబంపై దాడి కేసును పంజాబ్ పోలీసులు చేధించారు.
భారతదేశంతో పాటు ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనత్త కుటుంబంపై దాడి కేసును పంజాబ్ పోలీసులు చేధించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రకటించారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి వుందని పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు.
గత నెల 19న రాత్రి సమయంలో పఠాన్కోట్ జిల్లాలోని థర్యాల్ గ్రామంలో.. డాబా మీద నిద్రిస్తోన్న రైనా మేనత్త కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో రైనా మేనత్త భర్త, కాంట్రాక్టర్ అయిన అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
కొద్ది రోజుల అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతూ రైనా కజిన్ కౌశల్ కుమార్ కూడా చనిపోయాడు. క్రికెటర్ మేనత్త ఆశారాణి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిలో గాయపడిన మరో ఇద్దరు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సురేశ్ రైనా యూఏఈ నుంచి భారత్ తిరిగొచ్చిన తర్వాత ఈ దాడి విషయం వెలుగు చూసింది. తమ మేనత్త కుటుంబంపై ఇంతటి తీవ్రమైన దాడికి పాల్పడిన దోషులను గుర్తించాలని పంజాబ్ సీఎంను రైనా కోరాడు. స్పందించిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేశారు.