Andhra Pradesh By Election Result 2022: తొలి రౌండ్లో విక్రమ్ రెడ్డికి 5 వేలకు పైగా ఆధిక్యం..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ నెల 23న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ జరగగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ నెల 23న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ జరగగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తిచేశారు. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మధ్యాహ్నం వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక, తొలి రౌండ్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 5,337 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చినందున.. గత సంప్రదాయాన్ని పాటించి ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ ప్రకటించింది.
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న జరిగగా.. గతంలో కంటే ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. గతంలో ఆత్మకూరులో 82.44 శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజాగా అక్కడ 64.26 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం 18.18 శాతం తగ్గింది.
ఇక, ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండుసార్లు వైసీపీ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయన 31 వేలకు పైగా ఆధిక్యం సాధించగా.. 2019లో 22 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి మెజారిటీ లక్షకు పైగా ఉండాలని వైసీపీ భావించింది. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు ఆత్మకూరులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో.. వైసీపీ లక్ష మెజారిటీ సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.