ఏయిర్ ఆసియా వివాదంపై స్పందించిన అశోక్ గజపతి రాజు
ఎయిర్ ఏషియా వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పి. అశోక్ గజపతి రాజు స్పందించారు.
విజయనగరం: ఎయిర్ ఏషియా వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పి. అశోక్ గజపతి రాజు స్పందించారు. విజయనగరంలో జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిర్ ఏషియా సీఈఓల మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో తనకేమిటి సంబంధమని ఆయన ప్రశ్నించారు.
అది ప్రైవేటు వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణ అని చెప్పారు. ఈ వ్యవహారంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని అన్నారు. నేటి నాయకులు ఎన్టీ రామారావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
రాజకీయాల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత అవగాహన, నిబద్ధత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రిసార్టుల్లో దీక్ష చేస్తే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని అన్నారు. ఏడాదిలోగా ఎన్నికలు వస్తుండగా ఇప్పుడు ఈ రాజీనామాల డ్రామా ఎందుకని ప్రశ్నించారు.