ఏపీ బ్రాండ్ గా .. బొంగు బిర్యానీ
విశాఖ ఏజెన్సీలోని అరకు లోయ నుంచి మారేడుమిల్లి వరకు పర్యటక ప్రాంతాల్లో ఈ చికెన్ అందుబాటులో ఉంటుంది. కొంతమంది గిరిజనులకే అత్యంత రుచికరంగా ఈ చికెన్ తయారు చేయడం సాధ్యపడుతుంది.
హైదరాబాద్ అనగానే మనందరికీ ముందుగా గుర్తకొచ్చేది బిర్యానీనే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. బిర్యానీ అంటే హైదరాబాద్ అనే బ్రాండ్ ఎలా పడిపోయిందో.. ఏపీకి కూడా అలాంటి బ్రాండ్ నే తీసుకురావాలని చూస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అరకు కూడా ఒకటి. అక్కడి ప్రకృతి సోయగాలను వీక్షించడానికి చాలామంది పర్యాటకులు ప్రతి సంవత్సరం అరకు వెళుతూ ఉంటారు. అక్కడ లభించే బొంగు చికెన్ కూడా చాలా ఫేమస్. వెదురు బొంగుల్లో చికెన్ కర్రీ తయారు చేయడం దీని ప్రత్యేకత. కేవలం చికెన్ మాత్రమే కాదు.. బిర్యానీ కూడా బొంగులో తయారు చేస్తారు.
విశాఖ ఏజెన్సీలోని అరకు లోయ నుంచి మారేడుమిల్లి వరకు పర్యటక ప్రాంతాల్లో ఈ చికెన్ అందుబాటులో ఉంటుంది. కొంతమంది గిరిజనులకే అత్యంత రుచికరంగా ఈ చికెన్ తయారు చేయడం సాధ్యపడుతుంది. అందుకే విశాఖను మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు.. ఈ బొంగు బిర్యానీని రాష్ట్ర బ్రాండ్ గా చేయాలని భావిస్తున్నారు.
బొంగు బిర్యానీ అనగానే ఏపీని గుర్తుచేసుకునే స్థాయిలో ప్రచారం కల్పించి, దీన్ని విస్తృత వినియోగంలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం చెఫ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా వంటకాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి వార్షిక ప్రణాళికను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. వెదురు బొంగులో చికెన్, ఇతర మసాలాలు కూరి, నిప్పులపై కాల్చి, నూనె వాడకుండానే తయారు చేసే ఈ వంటకాలను పర్యాటకులు లొట్టలేసుకుంటూ తింటారు.