బస్సెక్కితే మాస్క్ తప్పనిసరి... లేదంటే ఫైన్..: కరోనా కట్టడికి ఏపీఎస్ ఆర్టీసి కీలక నిర్ణయం
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో వుంచుకుని ఏపీఎస్ ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి (APSRTC) కరోనా (corona virus) కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిసిని గాడినపెట్టేందుకు, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్టిసి అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, కరోనా కట్టడికి ఏపీఎస్ ఆర్టీసి చర్యలు తీసుుకుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ఏపీలోనూ కరోనా థర్డ్ వేవ్ (corona third wave) నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్టిసి అప్రమత్తమయ్యింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో వుంచుకుని ఆర్టిసి బస్సుల్లో ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకుండా బస్సుల్లో ప్రయాణించే వారికి ఫైన్ విధిస్తున్నారు ఆర్టిసి సిబ్బంది.
ప్రస్తుతం సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి అత్యధికులు తమ తమ సొంతూళ్లకు వస్తుంటారు. ఈ క్రమంలో ఆర్టిసి బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా వుంది. దీంతో ప్రయాణికుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకుండా ఏపీఎస్ ఆర్టిసి ముందుజాగ్రత్తలు చేపట్టింది.
ఆర్టిసి బస్సులో ప్రయాణికులకు మాస్కు తప్పనిసరి చేస్తూ ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. మాస్కు ధరించకుండా బస్సులో ప్రయాణించే వారికి రూ.50 జరిమానా విధిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు ప్రయాణికులకు ఫైన్ విధించారు ఆర్టిసి సిబ్బంది.
ఇక ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ కూడా అప్రమత్తమయ్యింది. ఒమిక్రాన్, కరోరా వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు చర్యలు అమలు చేసింది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఆర్టిసి అధికారులకు కీలక ఉత్తర్వులను జారీ చేసారు. బస్సులో ప్రయాణించే పాసింజర్లకు మాస్క్ తప్పని సరి చేశారు. మాస్స్ ఉంటేనే బస్సులోకి అనుమతించాలని ఎండీ సజ్జనార్ ఆర్టీసి అధికారులను ఆదేశించారు.
ప్రయాణికులతో పాటు కండక్టర్ తో పాటు డ్రైవర్ కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలి. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా.. అన్నిబస్సులను శానిటైజ్ చేయాలని, ప్రతిరోజు.. డిపో నుండి బయటకు వెళ్లే ప్రతి బస్సును శానిటైజ్ చేయాలని, బస్సుల్లో శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సజ్జనార్ సూచించారు.
ఇక ఇప్పటికే మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారికి ఇరు తెలుగురాష్ట్రాలు జరిమానాలు విధిస్తున్నాయి. అలాగే పోలీసులు కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ఆందోళనలు చేపట్టకుండా తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా సంక్రాంతి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఏపీకి రానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి అధికంగా జరక్కుడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తోంది.
ఇక దేశంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏల్ల పైబడి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేటి నుంచి బూస్టర్ డోసు వేస్తున్నారు. గతంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి.. అదే రిజిస్ట్రేషన్తో వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో రెండు డోసుల సమయంలో ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో ఇప్పుడు కూడా అదే రకం వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే రెండో డోసు పూర్తయిన 90 రోజులు లేదా 39 వారాలు నిండిన తరువాతే ఈ ప్రికాషనరీ డోసు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.