‘ టీడీపీ.. ఇంట్లో ఇల్లాలు.. వైసీపీ వంటింట్లో ప్రియురాలు’
రఘువీరారెడ్డి వ్యంగ్యం
ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లుగా పోరాడింది తామేనని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ‘నాలుగేళ్లు బీజేపీతో మైత్రి చేసి టీడీపీ ఇంట్లో ఇల్లాలిగా ఉంది. బీజేపీకి దూరంగా ఉన్నామనే భ్రమను కల్పిస్తూ వంటిట్లో ప్రియురాలిగా వైసీపీ వ్యవహరిస్తోంది’ అని ఆయన వ్యంగ్యంగా ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ తెగేసి చెప్పిందని గుర్తుచేశారు.‘ప్రధానిగా మోదీ బాధ్యత స్వీకరించిన ఆరు రోజులకే నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్సభలో హోదా సహా విభజన హామీలన్నిటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాటి నుంచి నేటి దాకా.. హోదా కోసం గొంతెత్తుతున్నది కాంగ్రెసే. వైసీపీ మాత్రం.. కేంద్రానికి వినపడకుండా కీచుగొంతుకతో హోదా గురించి మాట్లాడుతోంది.’
‘కాంగ్రెస్ ను గేలిచేసిన పార్టీలే ఇప్పుడు హోదా కావాలంటున్నాయి. మా గొంతుక 2019 ఎన్నికలకు ప్రధాన ఎజెండాగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా ఇస్తామని రాహుల్గాంధీ హామీ ఇస్తున్నారు. ఇచ్చేది లేదంటున్న మోదీనే తాము విశ్వసిస్తామని జగన్ చెబుతున్నారు. ’ అని అన్నారు.
బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకార సమయంలో రాహుల్, చంద్రబాబు కలయిక కాకతాళీయమన్నారు. టీడీపీ కాంగ్రె్సకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని, 2019 ఎన్నికల్లో తమతో కలిసి పోటీచేస్తుందని భావించడం లేదని తెలిపారు.