రాజకీయాల్లోకి అశోక్ బాబు..?
అశోక్ బాబుకి టీడీపీలోకి ఆహ్వానం
ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు.. రాజకీయాల్లోకి రానున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా తాజా వ్యాఖ్యలు చేశారు అశోక్ బాబు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడి తెలుగు ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే విషయంపై పలువురు రాజకీయ నేతలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అశోక్ బాబు.. అక్కడి తెలుగు ప్రజలను కాంగ్రెస్ కి ఓటు వేయాల్సిందిగా సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా అశోక్ బాబు స్పందించారు.
కర్నాటకలో తాను కాంగ్రెస్ తరపున ప్రచారం చేయలేదని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు చెప్పారు.నిజానికి 2014లోనే చంద్రబాబు తనను టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని అశోక్బాబు చెప్పారు.తనపై బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు మానుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తానని హెచ్చరించారు. తనకు రూల్స్ తెలుసన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తాము సహకరిస్తామని చెప్పారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. బెంగళూరు వెళ్లి కేవలం మోడీ ప్రభుత్వ విధానాలను మాత్రమే తాను వివరించానని…. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయలేదన్నారు.