టెన్త్ పరీక్షలు: ఉపాధ్యాయులకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా సహకరించాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించింది
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా సహకరించాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించింది.
ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యా శాఖ సూచనలు చేసింది. 2021 పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా సందేహాలు నివృత్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పాఠశాలల్లో తిరిగి రిపోర్టు చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించింది.
అంతేకాకుండా జూన్లో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ, విద్యార్ధుల సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రాంతీయ డైరెక్టర్లను విద్యాశాఖ ఆదేశించింది. మే 1 నుంచి 31వ తేదీ వరకూ పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మే 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Also Read:తగ్గేదెలే..షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు జాగ్రత్తలు ఇవే: మంత్రి ఆదిమూలపు
పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించామని.. మే 5 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.
ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామాగ్రి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నాయని ఆదిమూలపు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. మొత్తం పదిన్నర లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని మంత్రి చెప్పారు.
ఒక్కో సెంటర్కు ఒక్కో కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించినట్లు సురేశ్ తెలిపారు. వైరస్ బారినపడిన విద్యార్ధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. ప్రతీ సెంటర్లో థర్మల్ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని... పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిమూలపు పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన దాఖలాలు లేవని సురేశ్ స్పష్టం చేశారు.