కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల స్థలం.. మొగలూర్తులో సంస్మరణ సభకు హాజరైన ఏపీ మంత్రులు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను నేడు ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగలూర్తులో నిర్వహించారు. కృష్ణంరాజు సంస్మరణ సభకు ఏపీ మంత్రులు రోజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజులు హాజరయ్యారు.
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను నేడు ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగలూర్తులో నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు సినీ నటుడు ప్రభాస్తో పాటు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున అభిమానులు మొగల్తూరుకు తరలించారు. అలాగే మొగల్తూరులో అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఏపీ మంత్రులు రోజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజులు కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన కృష్ణంరాజు మరణంతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. కృష్ణంరాజు పేరిట స్మృతివనం ఏర్పాటు ఏపీ ప్రభుత్వం రెండెకరాలు స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టుగా చెప్పారు.
Also Read: మొగల్తూరులో ప్రభాస్.. కృష్ణంరాజు సంస్మరణ సభకు భారీగా ఏర్పాట్లు.!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కూడా కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ‘‘రెబల్ స్టార్ గా ఠీవీ, దర్పం, ఉట్టిపడుతూ,చిరునవ్వుతో పలకరించే నిగర్వి కృష్ణంరాజు గారి మరణం మా అందరికీ, మా ప్రాంతానికీ తీరని లోటు. రాజకీయ రంగంలో కూడా కరప్షన్ లేకుండా గ్రామ గ్రామాన అభివృద్ధి నిధులు ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన కృష్ణంరాజు గారు మా మనసుల్లో చిరస్థాయిగా ఉంటారు..’’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు.
ఇక, కృష్ణంరాజు సంస్మరణ సభకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దాదాపు లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివస్తున్న అభిమానులు తప్పనిసరిగా భోజనం చేసే వెళ్లాలని ఇప్పటికే ప్రభాస్ కోరినట్టు తెలుస్తోంది. మొగల్తూరులోని 10 ఎకరాల మామిడి తోటలో అభిమానులకు భోజనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.