జగన్ ఎన్నిరోజులు పాదయాత్ర చేసినా మళ్లీ చంద్రబాబే సీఎం : పరిటాల సునీత
చంద్రబాబు ఎందువల్ల అనంత ప్రజలకు దేవుడయ్యడో తెలిపిన మంత్రి
వైసిపి అధినేత చేస్తున్న పాదయాత్రను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని మంత్రి పరిటాల సునీత అన్నారు. జగన్ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబును, టిడిపి పార్టీని తిట్టడానికే ఆ యాత్ర చేస్తున్నాడని తెలిపారు. ఈ యాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యల పై కాకుండా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, ఇలాంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడూ నమ్మరని మంత్రి విమర్శించారు.
కరువు జిల్లాగా పేరుపొందిన అనంతపురంకు హంద్రీనీవా ద్వారా నీళ్లిచ్చి చంద్రబాబు సస్యశ్యామలం చేశారని సునీత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని చెరువులకు నీరిచ్చిన ముఖ్యమంత్రిని ఇక్కడి ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. ఇలాంటి మంచి మనిషిని మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అందువల్ల చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు సునీత తెలిపారు.
ఇవాళ ఉదయం మంత్రి పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే తిరుమలలోనే కాస్సేపు మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్ పై మండిపడ్డారు.