ఇప్పుడేమో ప్రజల చెంతకు అంటారు.. అప్పుడు పొత్తు పెట్టుకుందామంటారు.. చంద్రబాబు, పవన్లపై మంత్రి జోగి రమేష్ ఫైర్
ఒకరేమో జిల్లాల పర్యటన అంటారని, మరొకరు జనవాణి అంటారని, తీరా ఎన్నికల సమయానికి పొత్తు పెట్టుకుందాం రా అంటారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. తమ ప్రభుత్వమే గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నదని పేర్కొన్నారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబేమో జిల్లాల పర్యటన అంటాడని, పవన్ కళ్యాణేమో జనవాణి అంటారని పేర్కొన్నారు. నువ్వటు తిరగరా.. నేటిను తిరుగుతానని ఇప్పుడు కూడబలుక్కుని తిరుగుతారని, తీరా ఎన్నికల సమయానికల్లా ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుందామంటారని విమర్శించారు. వారిద్దరూ అక్కర్లేని పనులు చేస్తున్నారని అన్నారు. జనవాణి కాదయ్య.. జనం దగ్గరకు వెళ్లు పవన్ కళ్యాణ్ అంటూ చురకలు అంటించారు.
ఇదే సందర్భంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తున్నాం.. చేయూత ఇస్తున్నామని తెలిపారు. కాపు నేస్తం ఇస్తున్నామని, రైతు భరోసా ఇస్తున్నామని వివరించారు. 62 లక్షల మంి అవ్వా తాతలకు పింఛన్లు ఇస్తున్నామని, ఈ కార్యక్రమం భారత్లో ఎక్కడైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ఇంకెవరైనా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారా? అని అడిగారు. అది కేవలం జగన్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అని వివరించారు.
ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తిరగడం మొదలు పెడతారని, చివరకు కలిసే పోటీ చేస్తారని అన్నారు. కానీ, రాబోయే ఎన్నికల్లో వారికి కుమ్ముడే కుమ్ముడు అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ రావు, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ అందరూ కలిసి వచ్చినా.. చిత్తు చిత్తేనని వివరించారు.
అయితే, సమస్యలు లేవా? అని అడగ్గా. సమస్యలు కచ్చితంగా ఉంటాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. అవి తీర్చడానికే కదా మేం ఉన్నదని అని వివరించారు. గడప గడపకు వెళ్లి మేం చేస్తున్నదే అది కదా అని చెప్పారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని వివరించారు. తాము ప్రకటించిన మ్యానిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చామని, ఆ ఘనత తమదేనని తెలిపారు.
కానీ, మ్యానిఫెస్టోను దాచి పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదని విమర్శలు చేశారు. సైట్లోనే మ్యానిఫెస్టో లేకుండా తొలగించారని పేర్కొన్నారు.