ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేం.. సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం : సీపీఎస్పై తేల్చేసిన బొత్స
జీపీఎస్కు చట్టబద్ధత కల్పిస్తున్నామని...ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని ఆయన సూచించారు.
సీపీఎస్పై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. జీపీఎస్ను అంగీకరించే ప్రసక్తే లేదని ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు అంశాలు కొత్తగా చేర్చి.. జీపీఎస్ 2.0 ప్రెజెంటేషన్ ఇచ్చిందని వారు తెలిపారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎస్లో అనేక ప్రయోజనాలు చేర్చామన్నారు. గతంలో చెప్పినదాని కంటే జీపీఎస్ను మరింత మెరుగుచేశామన్నారు. జీపీఎస్కు చట్టబద్ధత కల్పిస్తున్నామని...ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు.
ALso Read:పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలి:సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు
ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. మరోసారి సమావేశమై మళ్లీ చర్చిస్తామని.. చంద్రబాబు భార్యను ఎవరో ఏదో అన్నారని ఎలా ఫీలయ్యారో చూశామంటూ బొత్స సెటైర్లు వేశారు. రాజకీయంగా చూసుకోవాలి కాని నీచమైన ఆరోపణలు చేయొద్దని ఆయన హితవు పలికారు. లక్షలాది మంది రైతులకు గ్యారెంటీ వుందా.. నాయకులైన మాకు గ్యారెంటీ వుందా , అదృష్టవశాత్తూ ఉద్యోగులకు గ్యారెంటీ వుందని బొత్స అన్నారు.
అయినా ఉద్యోగులు ఆందోళన చేస్తామంటే ఏం చేయలేమని.. ఉద్యోగులపై పెట్టిన కేసుల గురించి కూడా చర్చించామని మంత్రి తెలిపారు. రేపు సీఎం జగన్ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తామని బొత్స సత్యనారాయణ వివరించారు. ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తోందని.. చంద్రబాబుకు బుద్ధి వుందా అంటూ మంత్రి ఫైరయ్యారు. సీఎం భార్య గురించి మాట్లాడటం సరికాదని.. చంద్రబాబుది నీచమైన ధోరణి అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్పై ఉద్యోగులు ఆలోచించాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులను కూడా ఉద్యోగులు దృష్టిలో పెట్టుకోవాలని సజ్జల హితవు పలికారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగులు పరిశీలించాలని.. లోపాలను సరిదిద్ది మంచి స్కీం తెస్తున్నామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉన్నంతలో బెటర్గానే ఇచ్చామని.. ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.