ప్రత్యేక హోదా: చంద్రబాబుపై అవంతి సంచలన వ్యాఖ్యలు
ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడాన్ని తాను ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ విషయమై తాను ఎంపీ పదవికి కూడ రాజీనామా చేస్తానని చెబితే తనను బెదిరించి దీక్షను విరమింపజేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడాన్ని తాను ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ విషయమై తాను ఎంపీ పదవికి కూడ రాజీనామా చేస్తానని చెబితే తనను బెదిరించి దీక్షను విరమింపజేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది.ఈ సమయంలో టీడీపీ సభ్యుల వాదనకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకొన్నామో టీడీపీ నేతలు వివరణ ఇచ్చారు. ఈ విషయమై చర్చలో మంత్రి అవంతి శ్రీనివాస్ జోక్యం చేసుకొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడాన్ని తాను ఆనాడే వ్యతిరేకించినట్టుగా ఆయన వివరించారు.
విశాఖకు రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ దీక్షకు దిగినట్టుగా ఆయన గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో తాను దీక్ష చేయడాన్ని టీడీపీ పెద్దలు ఒప్పుకోలేదన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి తనకు ఫోన్ చేసి వ్యంగ్యంగా మాట్లాడారని చెప్పారు.
దీక్షను వెంటనే విరమించుకోవాలని సీఎం కూడ ఫోన్ చేశారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని నిరసిస్తూ తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెబితే తనను బెదిరించారని ఆయన సభలో ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాటం చేస్తానంటే బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు.
2014 నుండి 2019 ఎన్నికల ముందు వరకు అవంతి శ్రీనివాస్ టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ టీడీపీకి,ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో భీమిలి నుండి అవంతి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా స్థానం దక్కించుకొన్నాడు.