కొవ్వెక్కింది.. వాడెవడో...: రెచ్చిపోయిన ఏపీ మంత్రి అప్పలరాజు
టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న, కూన రవికుమార్ లపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులపై కూడా వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు రెచ్చిపోయారు. అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానంలో ఢిల్లీ వెళ్లినవారు అమరావతి రైతులా అని ఆయన ప్రశ్నించారు. ముమ్మాటికీ వారు పెయిడ్ అర్టిస్టులేనని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
టీడీపీ నేత కూన రవికుమార్ కు కొవ్వెక్కిందని ఆయన అన్నారు. వాడెవడో... బుద్దా వెంకన్న ఏదో వాగుతున్నాడని ఆయన అన్నారు. బరి తెగించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు కొవ్వు తీసే సమయం ఆసన్నమైందని మంత్రి వ్యాఖ్యానించారు.
విశాఖ రాజధాని కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ టీడీపీ నేతలు తనపై పోటీ చేసి గెలువగలరా అని ఆయన ప్రశ్నించారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కృష్ణదాస్ తన నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన విషయాలను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించిందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో "మా ప్రభుత్వం ఇచ్చిన పది వేలు తీసుకుని ఓటెయ్యవా అని, అది నీ మొగుడి సొమ్మా" అని అసభ్యకరమైన పదజాలం ప్రయోగించిన విషయం అందరికీ గుర్తుందని మంత్రి అన్నారు. అదే పార్టీకి చెందిన రవి కుమార్ ఫోన్ సంభాషణలు అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లో వ్యవహరించగలరో వారినే చంద్రబాబు గుర్తించి అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అందరికీ అర్థమవుతోందని ఆయన అన్నారు కృష్ణదాస్ రాజకీయ చరిత్రలో ఎక్కడా వివాదం లేదని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు
అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. కరోనా కాలంలో కనిపించని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేయడానికి రావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసు స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం రౌడీయిజానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.