ఈనాడు దినపత్రికపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అంటూ వ్యంగ్యంగా రాస్తున్నదని, ఏపీ సీఎం జగన్‌పై మెల్ల మెల్లగా విషం కక్కుతున్నదని ధ్వజమెత్తారు. అదే టీడీపీ హయాంలో మాత్రం పోలవరంలో శరవేగంగా పనులు అంటూ వార్తలు రాసిందని మండిపడ్డారు.  

అమరావతి: ఈనాడు దినపత్రికపై వైసీపీ ఫైర్ అయింది. ఆ దినపత్రిక సీఎం జగన్‌పై విషం కక్కుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కల్పించేలా కథనాలు రాస్తున్నదని, ఈ పత్రిక మెల్ల మెల్లగా విషం ఎక్కించే పని చేస్తున్నదని మండిపడ్డారు. పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అంటూ వార్తలు రాయడాన్ని ఖండించారు. ఇలా ప్రజల్లో అలజడి రేపే వార్తలు రాయడం ఎందుకు? వాస్తవాలు రాయండని అన్నారు. ఇదే పత్రిక ఈ
ప్రాజెక్టు గురించే టీడీపీ హయాంలో రాసిన తీరును గుర్తు చేశారు. ఆ పత్రిక అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఎండగట్టారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, అది పొరుగు రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ చేపట్టాల్సిన ప్రాజెక్టు అని వివరించారు. అంత సింపుల్‌గా ప్రాజెక్టు కట్టడం కుదరదని, ఇది జాతీయ ప్రాజెక్టు అని, కేంద్రం నుంచి ఫండ్స్ రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈనాడు పత్రిక రాసిన పోలవరం పునరావాసం రెండు ముక్కలు అనే వార్త గురించి మాట్లాడారు.

ప్రపంచంలో ఏ ప్రాజెక్టు అయినా ఒకేసారి నీటితో నింపేయరని అంబటి రాంబాబు అన్నారు. ఏ ప్రాజెక్టు గురించి తెలుసుకున్న ఈ విషయం బోధపడుతుందని తెలిపారు. దశలవారీగా ఆ ప్రాజెక్టులో నీటిని నింపుతారని వివరించారు. ఒకేసారి నీటితో నింపితే చాలా ఒడిదుడుకులు వస్తాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం లిమిట్ 45 మీటర్లకు పైగా ఉన్నదని తెలిపారు. ముందు ఇందులో 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని చెప్పారు. తద్వార అక్కడి వరకు నింపితే మునిగే ప్రాంతాల్లోని ప్రజలకు పునరావాసం
కల్పిస్తారని వివరించారు. కానీ, ఈనాడు ఈ విషయాన్ని చెప్పాల్సింది పోయి విషాన్ని ఎక్కించేలా వార్త రాసిందని పేర్కొన్నారు.

పోలవరం గురించి వార్తలు రాయడంలో అభ్యంతరం లేదని, కానీ, వాస్తవాలను రాయడం లేదనేదే తమ ఆందోళన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులో రూ.800 కోట్లు మళ్లీ ఖర్చు పెట్టారని వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వార్తలు రాశారని వివరించారు. అసలు అదనంగా రూ. 800 కోట్లు ఖర్చుపెట్టడానికి కారణం ఎవరు అనేది కూడా ఆ పత్రిక రాయాలి కదా? ఆ కారణం గురించి ఎందుకు రాయలేదని అడిగారు. అదనంగా మళ్లీ రూ. 800 కోట్ల ఖర్చు పెట్టడానికి కారణం గత ప్రభుత్వం అని
చెప్పారు. తాను ఈ మాట బురదజల్లడానికి చెప్పడం లేదని, వాస్తవాలు వెతుక్కుంటే వారికే అర్థం అవుతుందని అన్నారు.

చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టును వాడుకున్నాడని, త్వరగా అయిపోయే రీతిలో కట్టేసి కమీషన్లు కొట్టేశాడని ఆరోపించారు. చంద్రబాబు స్పిల్ వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టించి డబ్బు కొట్టేశాడు. కాపర్ డ్యాం కట్టించడం సులువైన పని కదా.. చంద్రబాబు అందుకే దానికి మొగ్గు చూపాడని పేర్కొన్నారు. కానీ, అది బలహీనమైనది... కాబట్టే వరదలకు అది కొట్టుకుపోయిందని తెలిపారు. డయాఫ్రం వాల్ సైతం కొట్టుకుపోయిందని వివరించారు. అందుకే ఇప్పుడు మళ్లీ కట్టించాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. దీనికి కారణమైన చంద్రబాబు గురించి ఎందుకు ఈనాడు దినపత్రిక రాయడం లేదని నిలదీశారు. 

ఏపీ సీఎంగా జగన్ పదవికి ఎక్కిన తర్వాత పోలవరం పనులను చిత్తశుద్ధితో చేపడుతున్నారని మంత్రి వివరించారు. నిత్యం ఆయన ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం, కేంద్రమంత్రి పోలవరం పరిశీలించారని, అక్కడ పునరావాస కాలనీు కూడా బాగా చేపడుతున్నారని కేంద్ర మంత్రే ప్రకటించారని గుర్తు చేశారు.