ముందస్తుకు టీడీపీ సిద్ధం: మంత్రి ఆదినారాయణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఏపీకి త్వరలో వస్తానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఏపీకి వస్తే కేసీఆర్ ను స్వాగతిస్తామని, ఆయన దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. సంక్షేమ పథకాల వల్లే టీఆర్ఎస్ విజయం సాధించిందని తెలిపారు.
రాష్ట్రం ముక్కలు కావడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణమని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో వైసీపీ, జనసేన పార్టీ నేతలు సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగానలో ప్రతిపక్ష నేత జగన్ కనీసం పోటీ కూడా చేయలేదని, పవన్ అటు వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు.
జగన్, పవన్ రాజకీయాలు మానుకోవాలని, ప్రజలు ఇద్దర్నీ తిరస్కరిస్తారని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ధర్మపోరాటం చేస్తోన్న చంద్రబాబుని విమర్శిస్తున్నారా అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామన్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.