కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నాం: ఏపీ ఇరిగేషన్ శాఖ
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని ఏపీ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని శ్యామలరావు స్పష్టం చేశారు.
ఏపీ ఎన్నిసార్లు విజ్ఙప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన ఆపలేదన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్యామలరావు. కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి పరిధి, ఇతర మార్గదర్శకాలతో కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో శ్యామల రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వైఖరితో శ్రీశైలం ప్రాజెక్ట్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని ఆయన తెలిపారు. విద్యుత్ కోసం తెలంగాణ 8 టీఎంసీల నీటిని వాడుకుందని శ్యామలరావు ఆరోపించారు. ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని ముందు నుంచి తాము కోరుతున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని శ్యామలరావు స్పష్టం చేశారు.
ALso Read:సుదీర్ఘ కసరత్తు చేశాకే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు: కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ
అంతకుముందు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకొచ్చామని కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ తెలిపారు.శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. సెక్షన్ 84 ప్రకారంగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.