విశాఖ విషవాయువుల లీకేజీపై సీరియస్... కంపనీ మూసేయాలని పరిశ్రమల మంత్రి ఆదేశం
సొంత జిల్లా అనకాపల్లిలోని బ్రాండెక్స్ సీడ్స్ కపనీ గ్యాస్ లీకేజీ ఘటనపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ కంపనీ మూసివేతకు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.
విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ఫార్మా కంపనీల్లో విషవాయువుల లీకై కలకలం సృష్టించిన ఘటన మరువకముందే విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్ కంపనీలో విషవాయువులు లీకై అందులో పనిచేసే మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకే కంపనీలో రెండోసారి గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకోవడంపై వైసిపి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వెంటనే కంపనీని మూసివేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించి బ్రాండిక్స్ కంపనీకి నోటీసులు ఇచ్చామని gudiwada amarnath తెలిపారు.
brandix సీడ్స్ కంపనీలో విషవాయువల లీకేజీ ఇదే మొదటిసారి కాదని... ఇదివరకు కూడా ఇలాగే గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుందని మంత్రి అమర్నాథ్ గుర్తుచేసారు. అప్పుడు యాదృచ్చికంగా గ్యాస్ లీక్ జరిగిందన్న కంపనీ వివరణ ఇచ్చిందని మంత్రి అన్నారు. గతంలో ఏసీ డెక్ లో క్రిమిసంహారక మందులు కలపడం వల్ల ప్రమాదం జరిగిందని... అప్పుడు గ్లోరిక్ పాలీస్ అనే రసాయనం వెలువడిందని కంపనీ తెలిపిందన్నారు. మరి ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి వుందన్నారు. తప్పు జరిగితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనని మంత్రి అన్నారు.
ఒకసారి ప్రమాదం జరిగితే యాదృచ్చికంగా జరిగిందని భావిస్తాం... పదే పదే అలాగే జరిగినే ఉపేక్షించబోమని మంత్రి అమర్నాథ్ అన్నారు. అందువల్లే విషవాయువుల లీకేజీతో మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే బ్రాండిక్స్ కంపనీని మూసివేయాలని నోటీసులు జారీచేసామన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి ప్రమాదం జరిగిందా? విషవాయువుల విడుదలకు కారణమేంటి? ఏ విషయవాయువులు వెలువడ్డాయి? అన్నది నిర్దారణ కావాల్సి వుంది. తాజాగా జరిగిన ప్రమాదం యాదృచ్ఛికమా లేక ఉద్దేశ్య పూర్వకంగానే చేసారా అన్నది తెలియాల్సి వుంది.
Video విశాఖలో దారుణం... విషవాయువులు లీకై ఎక్కడికక్కడ కుప్పకూలిన మహిళలు
రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ సేప్టీ చర్యలు తప్పకుండా చేపట్టాలని... లేదంటే ప్రభుత్వ చర్యలు తప్పవని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు. బ్రాండిక్స్ కంపనీ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపడతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్యాస్ లీక్ ఘటనాస్థలిలో నమూనాలు సేకరించి టెస్టులకోసం హైదరాబాద్ లోని ఐసిఎంఆర్ కు పంపుతున్నట్లు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
ఇదిలావుంటే బ్రాండిక్స్ కంపనీ గ్యాస్ లీక్ తో మహిళా కార్మికులు అస్వస్థతకు గురయి హాస్పటల్ పాలవడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంతమైన విశాఖపట్నంను విషాదపట్నంగా మార్చేసారని మండిపడ్డారు. విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతన్నా వైసిపి ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని అన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఒకే కంపనీలో రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతోందని లోకేష్ మండిపడ్డారు.
విశాఖపట్నంలో జే గ్యాంగ్ (జగన్ గ్యాంగ్) కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విష రసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. గతంలో ఎల్జీ పాలీమర్స్ మరణమృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే తాజాగా అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపనీలో విషవాయువులు లీకై వందలమంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురికావడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు...కమీషన్లు నెలనెలా అందితే చాలన్నట్టుంది జగన్ పరిపాలన అంటూ మండిపడ్డారు. చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు సీఎం గారూ! వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోండి అంటూ లోకేష్ సూచించారు.