సారాంశం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి ఏపీ హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి ఏపీ హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైలులో మావోయిస్టులు ఉన్నా చంద్రబాబుకు ఇబ్బంది లేదని అన్నారు. చంద్రబాబు బ్లాక్‌కు మావోయిస్టుల బ్లాక్  దూరంగా ఉందని చెప్పారు. చంద్రబాబు భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు భద్రత భాద్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 

ఇదిలాఉంటే, చంద్రబాబును హౌస్ రిమాండ్‌ పిటిషన్‌పై ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ కోరుతున్న ఆయన తరఫు న్యాయవాదులు ప్రధానంగా భద్రత అంశాన్ని ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారని.. ఆయనకు జైలులో ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అన్నారు. ఆయనకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. హౌస్ రిమాండ్‌కు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు. 

అయితే చంద్రబాబుకు హౌస్  రిమాండ్‌ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని  కోరారు. రాజమండ్రి జైలులో తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ నుంచి వచ్చిన లేఖను కూడా కోర్టుకు మసర్పించారు. 

సోమవారం  కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సోమవారం సాయంత్రం వాదనలు ముగియగా.. న్యాయమూర్తి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్టుగా సమాచారం.