ఎస్ఈసీ కి సహకరించకుంటే... తీవ్ర పరిణామాలు: జగన్ సర్కార్ కు హైకోర్ట్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రభుత్వాలు వస్తాయి, వెళ్తాయి... కానీ రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయంటూ ఎస్ఈసి విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేమీ బాగోలేదంటూ మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదని... ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసికి సహకరించడం లేదన్నారు. మీకు ఇష్టంలేదని రూల్స్ కి వ్యతిరేకంగా ఓ వ్యక్తిని తీసేస్తే... అతనికి తాము న్యాయబద్ధంగా పనిచేసే అవకాశం కల్పించామన్నారు. అయినా మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
''రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వస్తాయి, వెళ్తాయి... కానీ రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వుంది. కాబట్టి 3 వారాల్లో ఎస్ఈసీ సమగ్రమైన నివేదిక ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలి'' అని న్యాయస్థానం ఆదేశించింది.
''జస్టిస్ కనగరాజ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించక్కర్లేదు. కనగరాజ్ ఆ డబ్బులు వ్యక్తిగతంగానే చెల్లించాలి. కనగరాజ్ డబ్బుల విషయాన్ని ఈసీ పరిశీలించాలి. ఆయన లీగల్ ఖర్చులను ఎస్ఈసీ ఎందుకు భరించాలి. అన్ని అంశాలపై ప్రభుత్వానికి ఎస్ఈసీ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఎస్ఈసీ నివేదికను బట్టి ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' అంటూ వైసిపి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.