అంగళ్లు కేసు..చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
అంగళ్లు ఘటనకు సంబంధించి కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్సై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టును తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడించనున్నట్టుగా తెలిపింది.
అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు.. అంగళ్లు, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లకు ఏపీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. అంగళ్లు కేసులో డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు తెలిపింది. దీంతో చంద్రబాబు నాయుడు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం మరోమారు హైకోర్టును ఆశ్రయించారు.
అంగళ్లు కేసులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనల సందర్భంగా.. కేసు దర్యాప్తునకు తన క్లయింట్ సహకరిస్తానని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలోనే అంగళ్లు కేసులో అక్టోబరు 12 వరకు అరెస్టు చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తాజాగా నేడు తదుపరి విచారణ జరగగా.. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.