విశాఖ : రుషికొండపై నిర్మాణాలు.. కేంద్రానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
విశాఖపట్నంలోని రుషికొండ వద్ద జరుగుతున్ని నిర్మాణాలకు సంబంధించి కేంద్రానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది . రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

విశాఖపట్నంలోని రుషికొండ వద్ద జరుగుతున్ని నిర్మాణాలకు సంబంధించి కేంద్రానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాల్సిందిగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. దీనిపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.
కాగా.. రుషికొండలో 9.88 ఎకరాలకు అనుమతులు ఇస్తే.. 20 ఎకరాల్లో తవ్వకాలు ఎందుకు చేపట్టారని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరుగుతున్న దశలో అనుమతించిన దానికంటే 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ అంతకుమించి తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించిన నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంది. రుషికొండలో సర్వే చేపట్టింది. తాజాగా ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALso Read: రుషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయం.. సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్..
అంతకుముందు హైకోర్టు నియమించిన కమిటీ సైతం రుషికొండపై అనుమతికి మించిన నిర్మాణాలు జరుగుతున్నాయని న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. త్వరలో విశాఖకు తాను మకాం మార్చుతున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.