టీచర్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అవకతవకలు.. ఈపీఎఫ్ వివరాలు కోరిన ఏపీ హైకోర్ట్, విచారణ రేపటికి వాయిదా
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ యూటీఎఫ్ ఆరోపించింది . దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాపై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని ఓటర్ల లిస్టులో అనర్హులని చేర్చారంటూ దాఖలైన పిటిషనపై ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఈపీఎఫ్ వివరాలను ఎందుకు పొందుపరచలేదని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాగా... ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని యూటీఎఫ్ ఆరోపించింది. ఉపాధ్యాయుల ఓటరు జాబితాలో చేర్చిన అనర్హులను తొలగించాలని యూటీఎఫ్ ఏపీ హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. వచ్చే ఏడాది మార్చి 29న రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఉపాధ్యాయ , గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదుగురు సభ్యులు 2023 మార్చిలో రిటైర్ కానున్నారు. దీంతో ఈ ఐదు స్థానాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది.
ALso REad: టీచర్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అవకతవకలు: ఏపీ హైకోర్టులో యూటీఎఫ్ పిటిషన్
ఈ ఏడాది నవంబర్ 7వ తేదీ నుండి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకొనే వెసులుబాటును ఈసీ కల్పించింది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చెందిన ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని యూటీఎప్ ఆరోపించింది. ఈ విషయమై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనర్హులను ఓటరు జాబితాలో చేర్చినట్టుగా యూటీఎఫ్ నేతలు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రకాశంలో 50, చిత్తూరులో 30, నెల్లూరులో 50 శాతం జాబితాలో మార్పులు చేశారని యూటీఎప్ ఆ పిటిషన్ లో ఆరోపించింది. ఉపాధ్యాయ ఓటరు జాబితాలో అనర్హుల పేర్లను తొలగించాలని ఆ పిటిషన్ లో యూటీఎఫ్ నేతలు కోరారు.