మీరోక ఎస్ఈసీ, సీఎస్గా చేశారు.. ఇంగ్లీష్ అర్థం చేసుకోలేరా: నీలం సాహ్నిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నిపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఏపీ ఎన్నికల కమిషనర్పై అసహనం వ్యక్తం చేసింది
ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నిపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఏపీ ఎన్నికల కమిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్టుగా ఏపీ ఎన్నికల కమిషన్ అన్వాయించుకుందని మండిపడింది.
చదవటం, అవగాహన చేసుకోవటంలో వైఫల్యం చెందారని సుప్రీంకోర్టు తీర్పును ఇలా అన్వయించుకోవటం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పులో నాలుగు వారాల సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉందని పేర్కొంది.
చదవటం, రాయటం, ఇంగ్లీష్ భాషపై అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీంకోర్టు తీర్పు అర్థమవుతుందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కానీ ఏపీ ఎన్నికల కమిషనర్.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేశారని.. ఆమె సుప్రీంకోర్టు తీర్పును సరైన దృక్పధంలో అర్థం చేసుకోకపోవటం ఆశ్చర్యాన్ని కల్గించిందని హైకోర్టు పేర్కొంది.
Also Read:నీలం సాహ్నికి హైకోర్టు షాక్: పరిషత్ ఎన్నికలు రద్దు, సవాల్ చేసే యోచన
ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని... సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా నీలం సాహ్ని వ్యవహరించారని మండిపడింది.
సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు నిలదీసింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని ఏపీ హైకోర్టు పేర్కొంది.