కోర్టులో హైడ్రామా: రఘురామ కేసు విచారణకు ప్రత్యేక బెంచ్
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విచారణ నిమిత్తం ఏపీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విచారణ నిమిత్తం ఏపీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది.
జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఈ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే రఘురామకృష్ణంరాజుపై విచారణ మొదలుకానుంది. అంతకుముందు ఎంపీ రిమాండ్ రిపోర్ట్ సరిగా లేకపోవడంతో సీఐడీ న్యాయస్థానం మెజిస్ట్రేట్ దానిని తిప్పిపంపారు.
ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఆయన కాళ్లకు గాయాలు కనిపించాయి. విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Also Read:కాళ్ల నిండా గాయాలు.. పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామరాజు ఫిర్యాదు
ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన ఆరోపించారు.
మరోవైపు రఘురామకృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నేరుగా తమ వద్దకు రావడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీనిపై దాదాపు 45 నిమిషాల పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.
సెషన్స్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. రఘురామ కృష్ణమరాజు వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. రఘురామకృష్ణమ రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కోవిడ్ నిబంధనల మేరకు రఘురామకృష్ణమ రాజును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.