వైఎస్ వివేకా హత్య కేసు : ఏపీ హైకోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్.. విచారణ జూన్ 13కి వాయిదా
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు జూన్ 13కి వాయిదా వేసింది. విచారణ ఎప్పటిలోగా పూర్తవుతుందన్న ధర్మాసనం ప్రశ్నకు సీబీఐ బదులిచ్చింది. ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి వున్నందున దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందన్న దానిని ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై (bail petition) విచారణను జూన్ 13కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు (ap high court) . ఈ కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టిన హైకోర్టు.. గత విచారణ సందర్భంగా ఎప్పటిలోగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ (cbi) పూర్తి చేస్తుందని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో గురువారం నాటి విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని, దీంతో ఈ కేసు దర్యాప్తు ఎప్పటిలోగా పూర్తి అవుతుందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన కోర్టు... ఈ పిటిషన్లపై ఇక రెగ్యులర్ కోర్టులోనే విచారిస్తామని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది.
ALso Read:వివేకా హత్య వెనుక భారీ కుట్రకోణం.. నిందితులకు బెయిలిస్తే సాక్షులకు ముప్పు.. సీబీఐ
కాగా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న Devireddy Siva Shankar Reddy బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ అవుతానని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఈ ఏడాది మార్చి 26న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమైసమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు మే 2వ తేదీన ఏపీ హైకోర్టులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతి వాదిగా చేర్చాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఇకపోతే.. ఈ కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని గతేడాది నవంబర్ 17న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. 2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.