ఓటర్ల జాబితాలో అవకతవకలు.. పయ్యావుల కేశవ్ ఫిర్యాదు, అనంత జెడ్పీ సీఈవోపై వేటు
ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన అభియోగంపై అనంతపురం జిల్లా జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా నకిలీ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం భాస్కర్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో భోగస్ ఓట్ల వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశారు. తాజా ఏపీ అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా నకిలీ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు వేసింది. జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
నియోజకవర్గంలో 6 వేల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు చర్యలు చేపట్టారంటూ భాస్కర్ రెడ్డిపై కేశవ్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఉరవకొండలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపు, చేర్పులలో భాస్కర్ రెడ్డి ప్రమేయం వున్నట్లుగా తేలింది. దీంతో భాస్కర్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఏపీ సీఎస్ను ఆదేశించింది. ఈ ఆదేశాలపై చీఫ్ సెక్రటరీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఈసీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసింది.