మున్సిపాలిటీగా అమరావతి... ఏపీ సర్కార్ కసరత్తు , గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశం
అమరావతిని మున్సిపాలిటిని చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వకుంటే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామన్నారు.
అమరావతిని మున్సిపాలిటిని చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా 22 గ్రామ పంచాయతీలతో అమరావతిని మున్సిపాలిటిగా చేయాలని నిర్ణయించింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మున్సిపాలిటి ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామసభలకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. గ్రామ పంచాయతీల అభ్యంతరాలు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. గతంలో అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ పేరుతో గ్రామసభలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ALso REad:రాజధాని గ్రామాల ప్రజలకు సీఆర్డీఏ నోటీసులు.. మా సందేహాలు తీరిస్తేనేనంటూ రైతుల అభ్యంతరం
అయితే 22 గ్రామాలతో కార్పోరేషన్ ప్రతిపాదన తిరస్కరించారు గ్రామస్తులు. 29 గ్రామాలతో కూడిన కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. వాటిని పక్కనపెట్టి ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటి ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా వుంది. అయితే గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కలెక్టర్ ఆదేశాలివ్వడం గమనార్హం. నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వకుంటే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామన్నారు.