ఏపీ: ఇంటిని బట్టి ఆస్తి పన్ను.. తేడా వస్తే భారీ జరిమానా
రాష్ట్రంలో ఆస్తి పన్ను సవరణ చేస్తూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారించింది.
రాష్ట్రంలో ఆస్తి పన్ను సవరణ చేస్తూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారించింది. ఈ ఏడాది ఆస్తి పన్ను అద్దె విలువ ప్రాతిపదికన ప్రభుత్వం లెక్కించనుంది.
రిజిస్ట్రేషన్ విలువలు సవరించిన ప్రతిసారీ ఆస్తి పన్ను పెరగనుంది. ప్రస్తుత ఆస్తిపన్ను 10 శాతం కంటే ఎక్కువ వుంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ధార్మిక, వైద్య, విద్య, స్మారక, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది.
దీనితో పాటు సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. సవరించిన ప్రకారం 375 చదరపు అడుగుల లోపు వున్న భవనాలకు వార్షిక ఆస్తి పన్ను రూ.50గా నిర్ణయించింది.
భవన నిర్మాణ శైలి ఆధారంగా ఆస్తి పన్ను విలువ వర్గీకరించింది. ఆర్సీసీ, పెంకులు, రేకులు, నాపరాళ్లు, పూరిళ్ల వంటి ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించింది. అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం వరకూ జరిమానా కూడా విధించనున్నారు.