ప్రభుత్వోద్యుగులకు శుభవార్త... వారానికి ఐదురోజులే పని, పొడిగించిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగించింది జగన్ సర్కార్.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగించింది జగన్ సర్కార్. వచ్చే ఏడాది వరకు పొడిగిస్తూ తాజాగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం వర్తించనుంది.
ఆంధ్ర ప్రదేశ్ పాలన అమరావతి నుండి సాగిస్తున్న నాటి నుంచి సచివాలయం, హెచ్ఓడిలలో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసలుబాట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసులుబాటు వుంది. ఈ నెల 27 వ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠ తెరదించింది వైసిపి ప్రభుత్వం.
గతంలో చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని ప్రారంభించగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఐదు రోజులు పనిదినాలు సంవత్సరం పొడిగించగా తాజాగా మరో ఏడాది కాలం పొడిగించారు. వారానికి ఐదు పని దినాల విధానం కొనసాగించాలన్న ఉద్యోగులు వినతిని మన్నించి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
read more జగన్ కు మూడు రాజధానుల్లోనూ అక్రమ నిర్మాణాలు...: అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.ఇప్పటి వరకు 10 మంది సెక్రటేరియేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా తేలింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాంబర్ ఉండే ఫస్ట్ బ్లాక్లో జీఏడీ ఉద్యోగికి, ఆర్టీజీఎస్ ఉద్యోగికి కరోనా సోకింది.
సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, సహకార శాఖల ఉద్యోగులకు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు పూనం మాలకొండయ్య. అలాగే పరిశ్రమల శాఖ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. కాగా సచివాలయ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని సీఎస్ నీలం సాహ్నికి ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి సమయంలో ఐదు రోజుల పనిదినాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్ని నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.