పీఆర్సీ రగడ... ఉమ్మడిగానే పోరు, ఉద్యమం కోసం 12 మందితో స్టీరింగ్ కమిటీ : ఏపీ ఉద్యోగ సంఘాలు
పీఆర్సీపై (prc) అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఉద్యోగులు శుక్రవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో (ap chief secretary) సమావేశమయ్యారు. అన్ని సంఘాలు ఉమ్మడిగా కలిసి ముందుకెళ్తామని.. పీఆర్సీ జీవోలు వెంటనే నిలుపుదల చేయాలన్నదే మొదటి డిమాండ్ అని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
పీఆర్సీపై (prc) అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఉద్యోగులు శుక్రవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో (ap chief secretary) సమావేశమయ్యారు. అనంతరం ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు నష్టం జరుగుతుందని పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. అన్ని సంఘాలు ఉమ్మడిగా కలిసి ముందుకెళ్తామని.. పీఆర్సీ జీవోలు వెంటనే నిలుపుదల చేయాలన్నదే మొదటి డిమాండ్ అని వెంకట్రామిరెడ్డి చెప్పారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వాలనేది రెండో డిమాండ్ అన్నారు. ప్రభుత్వం పీఆర్సీపై మళ్లీ చర్చలు జరపాలని.. జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాలని వెంకట్రామిరెడ్డి కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో ఉద్యోగ నేత సూర్యనారాయణ (suryanarayana) మాట్లాడుతూ.. ట్రెజరీలకు ఇచ్చిన ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత జీతాలు ఇవ్వాలని సీఎస్ను కోరామని.. తీవ్రమైన ఆందోళన ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చేందుకు అపోయింట్మెంట్ కోరామని.. ఉద్యమం కోసం 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సూర్యనారాయణ తెలిపారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయాల్లోకి ఏ రాజకీయపార్టీని అనుమతించకూడదని నిర్ణయించామన్నారు. ఏపీడీఎఫ్ ఎమ్మెల్సీలు, ట్రేడ్ యూనియన్ లను ఉద్యమంలోకి తీసుకోస్తామన్నారు. సీపీఎస్ రద్దుతో పాటు ఇతర సమస్యలు కూడా సాధన సమితి ద్వారా సాదించాలని నిర్ణయించామని బొప్పరాజు తెలిపారు. బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, సోమవారం సీఎస్కు ఉద్యమ కార్యచరణ నోటీస్ ఇస్తామని తెలిపారు.
ఉద్యమ కార్యాచరణ ఇదే:
- ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ మీటింగ్లు..
- ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు
- ఈ నెల 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు.
- ఈ నెల 27 నుంచి 30 వరకూ జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు.
- ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం.
- ఫిబ్రవరి 5న సహాయ నిరాకరణ.
- ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె