జగన్ మంత్రివర్గం నుండి ఇద్దరు మంత్రులు ఔట్...రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
ఇటీవల రాజ్యసభకు ఎన్నికయిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలను ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.
అమరావతి: ఇటీవల రాజ్యసభకు ఎన్నికయిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలను ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. వీరిద్దరు జూన్ 19వ తేదీన రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవగా జూలై 1వ తేదీన తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.తాజాగా ఈ రాజీనామాలకు గవర్నర్ ఆమోదం లభించడంతో వీరిద్దరు అధికారికంగా జగన్ మంత్రిమండలి నుండి తప్పుకున్నట్లయింది.
పిల్లి సుభాష్ చంద్రబోస్. మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ కూడ బీసీ సామాజిక వర్గానికి చెందినవారే.శాసనమండలిని రద్దు చేయాలనే ఉద్దేశ్యంతో మండలి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిద్దరిని రాజ్యసభకు పంపారు జగన్. ఈ క్రమంలో మంత్రులుగా కొనసాగే అవకాశం లేదు కాబట్టి వీరిద్దరు తమ ఎమ్మెల్సీ పదవులతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
ఇక మరోవైపు ఈ నెల 22వ తేదీన ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో వారి స్థానంలో కొత్త మంత్రులతో భర్తీ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 22వ తేదీ మధ్యాహ్నం 1.29 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ నెలకొని ఉంది.
read more రెండు నెలల్లోనే 24వేల కేసులు,32వేల అరెస్టులు...ఇది మా నిబద్దత: మంత్రి నారాయణస్వామి
ఈ నెల 21వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈ నెల 22 వ తేదీన మధ్యాహ్నం మంత్రివర్గాన్ని సీఎం జగన్ విస్తరించనున్నారని సమాచారం. ఈ విషయమై అధికారులకు ఏర్పాట్లు చేయాలని సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. . పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల సామాజిక వర్గాలకు చెందినవారికే ఈ దఫా మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు ఈ రెండు పోస్టుల కోసం పలువురు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో ఏడాదిన్నర దాటితే మరోసారి జగన్ మంత్రివర్గాన్ని విస్తరించనే అవకాశం లేకపోలేదు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రుల పనితీరును సమీక్షించి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడు ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కనుంది. కేబినెట్ లో చాన్స్ దక్కాలంటే మరో ఏడాదిన్నర వరకు ఆగాల్సిందే.
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులను కూడ నామినేట్ చేయాలని ప్రభుత్వం ఇద్దరి పేర్లను సోమవారం లేదా మంగళవారం నాడు సిఫారసు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన వారికి మంత్రి పదవిని కల్పిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.