ఏపీ రాష్ట్ర గవర్నర్  బాధ్యతలు స్వీకరించిన  రెండు రోజుల తర్వాత  అబ్దుల్ నజీర్ ప్రధానితో భేటీ అయ్యారు.   

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం నాడు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నజీర్ రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 25నే గవర్నర్ నజీర్ ఢిల్లీకి వచ్చారు. నిన్న మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్న ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ కానున్నారు. 

also read:ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం

ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ను రాష్ట్రపతి నియమించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు జడ్జిగా ఈ ఏడాది జనవరి మాసంలోనే రిటైరయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన తర్వాత నజీర్ ను ఏపీ గవర్నర్ గా నియమించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రులతో సమావేశం కోసం అబ్దుల్ నజీర్ న్యూఢిల్లీకి వచ్చారు.