ఒక్క విద్యార్థి మరణించినా...: ఇంటర్ పరీక్షలపై జగన్ ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక
ఇంటర్ పరీక్షల సందర్భంగా ఒక్క విద్యార్ధి మరణించినా ఏపీప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల సందర్భంగా ఒక్క విద్యార్ధి మరణించినా ఏపీప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. పరీక్షలకు వెళ్లాలంటే పూర్తి వివరాలను అఫిడవిట్ లో పొందుపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎల్లుండి లోపుగా ఇంటర్ పరీక్షలపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
also read:సరైన సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం: ఏపీ మంత్రి సురేష్
పరీక్షల రద్దుపై రెండు రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది.అన్ని రాష్ట్రాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకొన్న తర్వాత కూడ ఇంకా ఏపీ ప్రభుత్వం ఎందుకు అనిశ్చితిగా ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కరోనా నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇంకా నిర్వహించలేదు. ఈ పరీక్షల నిర్వహణపై జూలైలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్టుగా ప్రకటించింది.