జెసి కి డబుల్ జలక్
- జెసి దివాకర్ రెడ్డికి అగ్ని పరీక్ష
- హైకోర్టు ఆగ్రహం
- సర్కారు దూరం
- ఆందోళనలో జెసి
- ముదిరిన దివాకర్ ట్రావెల్స్ వ్యవహారం
గోడ దెబ్బ చెంపదెబ్బ అంటే ఏమిటో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి రుచి చూసినట్లు అయింది ఈ ఘటనతో. అటు హైకోర్టు జెసి మీద సీరియస్ కాగా మరోవైపు చాపకింద నీరులా ఎపి సర్కారు కూడా దూరమవుతోంది జెసికి దీంతో ఆయన అగ్నిపరీక్ష ఎదుర్కోబోతున్నారు.
ప్రభుత్వ అండదండలతో చెలరేగిపోతున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హైకోర్టు మండిపడింది. ఆయన లేబర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆయన కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం కూడా మాటమార్చింది. అధికార పార్టీకే చెందిన ఆయన యాజమాన్యంలోని ట్రావెల్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం నివేదికను కోర్టుకు సమర్పించింది.
కృష్ణా జిల్లాలో జరిగిన ప్రమాదంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు నిబంధలను ఉల్లంఘించలేదంటూ క్లీన్చిట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముండ్లపాడు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం ఉల్లంఘనలపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, రజనిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ ఉధాసీనతను తప్పుబట్టింది.
ప్రభుత్వం తరపున కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్కుమార్ కోర్టుకు హాజరై ప్రమాదం జరిగిన తీరుపై ఒక నివేదిక ధర్మాసనానికి సమర్పించారు. దివాకర్ ట్రావెల్స్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని దీనిలో పేర్కొన్నారు. ఇలా చట్టాల్ని ఉల్లఘించిన మిగిలిన యాజమాన్యాలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వివరాలను పరిశీలించిన హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నందున తదుపరి విచారణను సెప్టెంబర్ కి వాయిదా వేసింది.
ఇక కోర్టు చివాట్లు పెట్టడంతో జెసి అక్రమాలకు వంతపాడి తలనొప్పులు తెచ్చుకోవడమెందుకని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి జెసితో డిస్టెన్స్ మెయింటెన్ చేయాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నయి.