మార్చిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు... మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలపై ఈ నెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది.
అమరావతి: వచ్చే నెల(మార్చి) మూడోవారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు సభను నిర్వహించే ఆవకాశాలున్నాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాలపై ఈ నెల 23న క్యాబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది.
గతేడాది కరోనా సమయంలోనూ రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్ను జగన్ సర్కార్ రూపొందించింది. ఈ బడ్జెట్ లో అందరూ ఊహించినట్టే సంక్షేమానికి పెద్దపీటవేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దాదాపుగా 21 సంక్షేమపథకాలకు సంబంధించిన కేటాయింపులను చేసారు. బయట ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కుదిపేస్తూ.... అన్ని దేశాలు కూడా ఆర్థికమందగమనాన్ని ఎదుర్కొంటున్న సమయంలో గత బడ్జెట్ సమావేశాలు జరిగాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కరోనా ప్రభావం తగ్గింది. దీంతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ కూడా గత సంవత్సరంలా కాకుండా కాస్త ముందుగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో వుంది. ఇందుకోసం చర్చించేందుకు వచ్చేవారం కేబినెట్ సమావేశమవ్వనుంది.