ఆంధ్రప్రదేశ్‌లోని ఆవులపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఆవులపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మే 17న విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. చిత్తూరు జిల్లా ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఇటీవల రద్దు చేసింది. అదే సమయంలో ఏపీ సర్కార్‌కు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులను పక్కన బెడుతూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలలతో కూడి ధర్మాసం ముందు ప్రస్తావించారు. రిజర్వాయర్‌కు పర్యావరణ క్లియరెన్స్ (ఈసీ)ని ఎన్‌జీటీ పక్కన పెట్టడం అసాధారణమైనదని రోహత్గీ అన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను మే 17కు పోస్టు చేశారు. ‘‘ఇది పబ్లిక్ ప్రాజెక్ట్ కాబట్టి మేము దానిని రేపటి తర్వాత జాబితా చేస్తాము’’ అని ధర్మాసనం తెలిపింది.

ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా ఆవులపల్లి రిజర్వాయర్‌కు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ- ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసిన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ గుత్తా గుణశేఖర్‌, మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున కె శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం నుండి 3.5 టిఎంసి అడుగుల నీటిని నిల్వ చేయడం ద్వారా 40,000 ఎకరాల కొత్త కమాండ్ ఏరియాను రూపొందించడానికి, 20,000 ఎకరాల ప్రస్తుత ఆయకట్టు కోసం ఆవులపల్లి ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపారు.

3.5 టీఎంసీల నీటి నిల్వ కోసం ప్రాజెక్టును ప్రతిపాదించినా.. పర్యావరణ అనుమతి కేవలం 2.5 టీఎంసీలకే వచ్చిందని శ్రవణ్ కుమార్ వాదించారు. అటవీ భూమిని వినియోగించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంపాక్ట్ అసెస్‌మెంట్ స్టడీ చేయలేదని.. కాలువల కోసం భూసేకరణ వివరాలను ఎస్‌ఈఐఏఏ-ఏపీకి సమర్పించలేదని అన్నారు. అయితే ఈ క్రమంలోనే ఎన్జీటీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని రద్దు చేసింది.