పింఛన్ దారులకు శుభవార్త... నేటి నుండే వైఎస్సార్ పెన్షన్ కానుక
ఆంధ్ర ప్రదేశ్ సోమవారం నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమయ్యింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సోమవారం నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమయ్యింది. ఉదయం నుండే ఇంటింటికి వెళ్ళి పెన్షనర్ల చేతికే పెన్షన్ సొమ్ము అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. ఇందుకోసం రూ.1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. పెన్షన్ల పంపిణీలో 2,37,615 మంది వాలంటీర్లు నిమగ్నమయ్యారు.
read more మోడీ ఇచ్చిన డబ్బును.. జగన్ తనవిగా చెప్పుకుంటున్నారు: కన్నా వ్యాఖ్యలు
కరోనా నియంత్రణలో భాగంగా ఈ పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. బయోమెట్రిక్ కు బదులు పెన్షనర్ల ఫోటోలు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో వున్న వారికి ఫించన్లు అందించేందుకు మరో ఏర్పాటు చేసింది. వీరికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారిలో అర్హత గత వారికి గుర్తించి కేవలం ఐదు రోజుల్లోనే పెన్షన్ డబ్బులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫించను పొందాలనుకునే వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వైయస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల ఎంపికకు అర్హతలు:
* గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి.
* నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి.
* టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.
* కుటుంబంలో పెన్షనర్ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు
* ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు
* కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు
* కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ కానుకకు అర్హులు (అయితే 80 శాతం పైగా దివ్యాంగులు, డయాలసిస్ పేషంట్లు, మానసికంగా తీవ్రంగా బాధ పడుతోన్న వారుంటే గనక వారికి కూడా పెన్షన్ అభిస్తుంది. ఒక ఇంటిలో అలాంటి పరిస్థితి గనక ఉంటే రెండో వ్యక్తికి కూడా పింఛన్ లభిస్తుంది)
ఆయా కెటగిరీల వారీగా అర్హతలు:
* 60 సంవత్సరాల వయసు పైబడిన నిరుపేదలు ...
* ఎస్సీ కెటగిరీకి చెందిన వారి వయసు 50 సంవత్సరాలు ఆపైన
* 18 సంవత్సరాలు పైగా వయసు వితంతువులు (చనిపోయిన భర్త గురించి దృవీకరణ పత్రం విధిగా ఉండాలి)
* దివ్యాంగులకు ఎలాంటి వయసు పరిమితి లేదు ( అయితే 40 శాతం పైగా దివ్యాంగులుగా ఉండాలి)
* 50 సంవత్సరాలు పై బడిన నేత కార్మికులు (చేనేత శాఖ నుంచి ధృవీకరణ పత్రాన్ని విధిగా సమర్పించాలి)
* 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన గీత కార్మికులు (ఎక్సయిజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి)
* ఆరు నెలలుగా యాంటీ రాట్రో వైరల్ తెరపీ ట్రీట్మెంటు తీసుకుంటున్న వారు
* ప్రతి నెలా ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్న రోగులు
* 18 సంవత్సరాల వయసు పైబడిన ట్రాన్స్జెండర్లు (వైద్య శాఖ సర్టిఫికె ట్ విధిగా కలిగి ఉండాలి)
* మత్స్య శాఖ నుంచి సర్టిఫికెట్ పొందిన 50 సంవత్సరాల పైబడిన మత్స్యకారులు
* వివాహమై విడిపోయిన ఒంటరి స్త్రీ... 35 సంవత్సరాల వయసు పై బడి.. తరువాత విడిపోయిన మహిళలు, ఏడాది పాటు సెపరేషన్గా ఉన్న మహిళలు, 30 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు.
* 50 సంవత్సరాల పైబడి వయసున్న డప్పు కళాకారులు (సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి)
* 40 సంవత్సరాల వయసున్న చర్మకారులు
* తలసేమిమా, సికిల్ సెల్ డిసీజ్, మేమోఫీలియా వ్యాధిగ్రస్థులు
* వీల్ చేర్కే పరిమితమైన పెరాలిసిస్ రోగులు, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు, మస్కులర్ డైస్ట్రోఫీ వ్యాధిగ్రస్థులు, క్రానిక్ కిడ్నీపేషంట్లు,
మొత్తంగా ఎస్సీ కుటుంబాలు, చేనేతలు, గీతకార్మికులు, క్షురకులు, దోభీలు,కార్పెంటర్లు, చర్మకారులు, బీసీలు, పశువుల కాపర్లు, దిన కూలీలు, వ్యవసాయ కార్మికులు, సంచార జాతులు, వితంతువులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
దరఖాస్థుదారుల స్థితి గతులను గ్రామ వలంటీర్లు పరిశీలించి ధృవీకరణ చేయాలి. పెన్షన్లను డోర్ డెలివరీ చేసే బాధ్యత కూడా వారిదే. గ్రామాలలో పని చేసే ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల కమిషనర్లు ఈ పథకం అమలుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.