రిటైర్మెంట్ కు ముందే ఆదిత్యనాథ్ దాస్ కు తీపికబురు... సీఎం జగన్ కీలక నిర్ణయం
మరో ఐదురోజల్లో రిటైర్ కానున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.
అమరావతి: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (AP CS)గా కొనసాగుతున్నఆదిత్యనాథ్ దాస్ (Adityanath Das) మరో ఐదురోజుల్లో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఇలా రిటైర్ కానున్న ఆయనకు సీఎం జగన్ (YS Jagan) తీపికబురు చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ కు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు (CM Chief Advisor) బాధ్యతలను అప్పగించారు జగన్. ఈమేరకు ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్ గా సమీర్ శర్మను బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే పదవీ విరమణ కంటే ముందుగానే ఆదిత్యనాథ్ సీఎం ముఖ్య సలహాదారుగా నియమింపబడ్డారు. ఈ మేరకు శనివారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు.
read more ఏపీ కొత్త సీఎస్గా సమీర్ శర్మ:అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ
ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారులుగా కొనసాగుతున్న వారి మాదిరిగానే ఆదిత్యనాథ్ కు కూడా క్యాబినెట్ హోదా కల్పించారు. ఆయన డిల్లీలోని ఏపీ భవన్ నుంచి విధులను నిర్వర్తించనున్నారు. అయితే ఆయన విధులేమిటో ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ విషయాన్ని తదుపరి ఉత్తర్వుల్లో తెలియజేస్తామని పేర్కొన్నారు.
గతంలో కూడా సీఎస్ గా పదవీ విరమణ పొందిన నీలం సాహ్నిని తన సలహాదారుగా నియమించుకున్నారు జగన్. ఆ తర్వాత ఆమెను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించారు. ఇప్పుడు ఇదే తరహాలో ఆదిత్యనాథ్ ను కూడా చీఫ్ అడ్వైజర్ గా నియమించుకున్న జగన్ తర్వాత ఆయన ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.