కరోనా వల్లే అప్పులు చేశాం... టీడీపీది అనవసర రాద్దాంతం: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అప్పులపై తెలుగుదేశం పార్టీ అనవసరపు రాద్దాంతం చేస్తోందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకే అప్పులు తెచ్చామని బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని మంత్రి ధ్వజమెత్తారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్రాక్ కంపెనీ వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అన్రాక్ కంపెనీ అంతర్జాతీయ కోర్టులో ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించామని బుగ్గన తెలిపారు. అన్రాక్ సంస్థకు అవసరమైన బాక్సైట్ను సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే ఒక పెద్ద కంపెనీ మన రాష్ట్రానికి వస్తుందని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వీటిని నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ అంశం, నిధుల విడుదలలో పురోగతి వుందని బుగ్గన పేర్కొన్నారు. అప్పులపై తెలుగుదేశం పార్టీ అనవసరపు రాద్దాంతం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకే అప్పులు తెచ్చామని బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఏపీ విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోందని బుగ్గన ఆరోపించారు.