జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. జగన్ నిర్ణయమే తరువాయి: స్పష్టతనిచ్చిన మంత్రి ఆదిమూలపు
జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని మంత్రి వెల్లడించారు. ఎగ్జామ్స్ రద్దు చేయండం నిమషం పట్టదని.. కానీ విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతగా వుందన్నారు.
సీఎం జగన్తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉందని.. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని యోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Also Read:టైం టేబుల్ తో సిద్దంగా వుండండి...: పది, ఇంటర్ పరీక్షలపై అధికారులకు మంత్రి సురేష్ ఆదేశాలు
వచ్చే నెల ఇంటర్ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయని ఆదిమూలపు పేర్కొన్నారు. సెప్టెంబరులో విద్యా సంవత్సరం ప్రారంభించి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. డిఎస్సి 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలు గా పెండింగ్ లో ఉందని.. కానీ సీఎం జగన్ పెద్ద మనస్సుతో వారికి అండగా నిలిచారని ఆదిమూలపు గుర్తుచేశారు. 2014 మేనిఫెస్టోలో పెట్టి టీడీపీ డిఎస్సి అభ్యర్థులను మోసం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఈరోజు సీఎం జగన్ 2193 మంది అభ్యర్థులను ఎస్జీటీలు గా నియమించేందుకు ఆమోదం తెలిపారని మంత్రి ప్రశంసించారు. త్వరలోనే జీఓ ఇచ్చి వారికి పోస్టింగ్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ముసలి కన్నీరు కార్చి, క్యాబినెట్ తీర్మానం చేసి కూడా అమలు చేయలేదని సురేశ్ ధ్వజమెత్తారు. దీని వల్ల సంవత్సరానికి సుమారు 50 నుండి 60 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి చెప్పారు. 1998 డిఎస్సిలపై కమిటీలు వేసి మరి చంద్రబాబు మోసం చేశారని.. తాము 36 మందిని గుర్తించి న్యాయం చేస్తున్నట్లు సురేశ్ పేర్కొన్నారు.